November 29, 2013

                          పుష్య విలాసం 
        పువ్వుల మాసం..పుష్య మాసం!
          వాకిట్లో ఏమాత్రం జాగా వున్నా నేల మీదో, కుండీల్లోనో బంతులూ చేమంతులూ పొందిగ్గా సర్దుకుని పువ్వులు సింగారించుకునే కాలం!
          సూర్యుడొచ్చేసరికల్లా తయారైపోవాలని రాత్రంతా కురిసిన మంచుబిందువుల్లో స్నానమాడి, పసి మొగ్గల్ని తప్పించుకుంటూ పైకి సర్దుకున్న  ముగ్ధ పూబాలలు మనసారా విచ్చుకుని, తొలికిరణాలతో భానుడు తమను తాకే క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూసే సన్నివేశం  !
        హేమంత యామిని బద్ధకంగా వెళ్తూ వెళ్తూ  చలి గాలినీ, తెలి మంచునీ వెనకే వదిలేసిన సందర్భం !
        ఇళ్ళ గోడలు రంగులు వెలిసినా, పగుళ్ళు తేలినా , ముంగిళ్ళలో మాత్రం ముగ్గులూ, గొబ్బిళ్ళూ, గొబ్బిళ్ళ కొప్పుల్లో రంగు రంగుల పువ్వులూ మెరిసి పోతుంటే  పుష్య లక్ష్మి వీధుల్లో సంచరించే సమయం!
      పరిచారకులు చీకటి తెరలన్నీ తొలగించి 'శ్రీ సూర్యనారాయణ గారొస్తున్నారహో ' అని ప్రకటించి చాలా సేపయినా  ఆయన గారి దర్శనమింకా కాలేదు. మెత్తని మబ్బుల రజాయి వెనక ఇంకా నిద్రిస్తూనే ఉన్నట్టున్నాడాయన.
     ' ఆయనకైతే చెల్లుతుంది..మనకట్టా కుదురుద్దా?..హ్హు ..' అనుకున్నాడు  సూర్యా రావు. అతనిక్కూడా  వెచ్చగా దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకోవాలని వుంది. అయినా గిరాకీ టైము వదిలేస్తే లాభం లేదని  చీకటితో లేచి కాఫీకూడా తాగకుండా అయిదున్నరకే టౌను సెంటరుకొచ్చి ఆటో నిలుపుకుని కూర్చున్నాడు. 
     కొంచెం దూరంలో రామాలయం కనిపిస్తోంది. గేటు ముందు తెల్లని ముగ్గులు మెరుస్తున్నాయి. సూర్యారావొచ్చేసరికి పూజారి గారమ్మాయి కళ్ళాపి జల్లి ముగ్గులు పెడుతోంది. ఆకుపచ్చని తడి నేల మీద తెల్లని మెలికల ముగ్గు చూడగానే కాంతి చేతివేళ్ళ సందుల్లోంచి వొంపులు తిరుగుతూ జారే ముగ్గుపిండి గుర్తొచ్చింది. కాంతి మొండితనమూ, ఒళ్ళుపొగరూ గుర్తొచ్చి లోపలి కోపం అగ్గిలాగా రాజుకుంది మళ్ళీ .
      ఇంకా నగర వాసనలు పూర్తిగా అంటుకోని ఊరు కావడంతో ప్రతి వీధి లోనూ ముగ్గులూ, గొబ్బిళ్ళూ , కాస్త పొద్దెక్కేసరికి ఎగిరే గాలి పటాలూ .పుష్య మాసమంతా కనిపించే దృశ్యాలే! వాటిలో అసాధారణమైనదేమీ లేదు.
      మామూలుగా లేనిది తన ఇంటి వాతావరణమే! రోజూ తెల్లవారక ముందే తనని లేపి, తను కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేసరికి వీధిలో పెద్ద పెద్ద ముగ్గులేసి వచ్చి కమ్మని కాఫీ కలుపుతుంది కాంతి. గుమ్మంలో కూర్చుని  'ముగ్గు ఇంత బావుంది.. అంత బావుంద ' ని పొగుడుతూ కాఫీ తాగేసి, చీకటి తెరలింకా విచ్చుకోక ముందే ఆటో తీసుకుని టౌను సెంటర్ కి రావడం అలవాటు తనకి.
      ఈ పండగల్లో దూరప్రాంతాలనించి రాత్రి  బస్సెక్కి తెల్లారేసరికి  టౌనుకొచ్చి చుట్టుపక్కల పల్లెలకి వెళ్లే  జనాలని తన ఆటోలో తీసుకెళ్ళి దింపడం, అలా సంపాదించిన అదనపు ఆదాయంతో భార్యకీ, పిల్లాడికీ బట్టలూ, ఇంటిక్కావల్సిన సరుకులూ కొనడం తనకెంతో సంతోషాన్నిచ్చే విషయాలు. ఈసారి ఎప్పటిలా కాలేదు. రాబడి బాగానే వుంది గాని తన బతుకే బాలేదు !  
      తాముండే ఇంటికి ఐమూలగా వున్న ఇంటి మేడ మీద కాలేజీ లెక్చరర్ ఒకతను వచ్చి చేరాడు ఈ మధ్యే. వాడొచ్చినప్పట్నించీ తనకీ, కాంతికీ మధ్య కీచులాటలు మొదలయ్యాయి. వీధి దీపపు మసక వెలుతుర్లో అర్ధగంటసేపు కళ్ళాపి జల్లుతూ ముగ్గులు తీరుస్తూ ఈవిడ హొయలు పోవడం, అంతసేపూ మేడమీద పచార్లు చేస్తూ తన కళాహృదయం చాటుకుంటూఆ బేవర్సుగాడు పోజులు కొట్టడం తను సహించలేక పోతున్నాడు.
      తన గుండెల్లో గుడిగంటలు మోగించిన బారెడు జడా, కుచ్చెళ్ళు దోపిన సన్నని నడుమూ ఇపుడు అలారం బెల్లు లా మోగుతూ అసహనాన్ని కలిగిస్తున్నాయి! వాడలా చూస్తున్నాడని తెలిసినపుడు చెయ్యాల్సిన పని గబ గబా పూర్తిచేసుకు రావాలా? ఉహూ
    తన మానాన తను చుక్కలు లెక్కేసుకుంటూ, మధ్యలో ముగ్గు రేఖని ' ఇటు తిప్పనా ..అటు తిప్పనా? ' అని వేళ్ళతో, కళ్ళతో విన్యాసాలు చేసుకుంటూ, ముందుకు పడే జడని వెనక్కి విసురుకుంటూ అర్థగంట సేపు ఇంటి ముందు రోడ్డు మీద తాండవం చేస్తుంది. చూసి చూసి ఇక భరించ లేక వీధి వాకిట్లో ఆ నాట్యభంగిమలక్కర్లేదనీ, తన ప్రతిభంతా చాటుకుంటూ ముగ్గులేసి ఎవర్నీ ఉద్ధరించక్కర్లేదనీ గట్టిగా వార్నింగిచ్చాడు తను.
    ’పుష్య మాసం వాకిట్లో ముగ్గు లేసుకోకుండా ఎవరూ వుంచుకోరనీ, ‘ఆయనెవడో వాళ్ళింటి ముందు పచార్లు చేస్తుంటే మనం మనింట్లో పనులు మానేసుకోవాలా?’ అనీ ఎదురు తిరిగింది! పండగ దగ్గరకొస్తున్న కొద్దీ తన మాట ఆవగింజంత  కూడా ఖాతరు చెయ్యకుండా పత్రికల్లో వచ్చే కొత్త కొత్త ముగ్గులు నేర్చుకుని మరీ వేయడం మొదలెట్టింది! తన పద్ధతి మార్చుకోలేదు సరికదా, కనీసం  దగ్గర కూర్చుని మొగుడి బాధేమిటో కనుక్కుందుకు ప్రయత్నం కూడా చెయ్యలేదు.
      ఈ విషయమై ఇద్దరూ ఘర్షణ పడి వారమైంది. ఒళ్ళూ పై తెలీని కోపంలో తనేదేదో వాగేశాడు. ముంచుకొచ్చిన ఆవేశంలో నోటికొచ్చిన మాటలన్నీ అనేసాడు. అపుడు కాంతి చూసిన చూపు తన మనసులో నాటుకు పోయింది. అందులో భావం ఏమిటో అర్ధం  కాని చిక్కు ప్రశ్నై గుర్తొచ్చినపుడల్లా  చికాకు పెడుతోంది.
     ఆ రోజునించీ ఇద్దరి మధ్యా మాటల్లేవు. తను డ్యూటీకెక్కే వరకు తన చుట్టే తిరుగుతూ, ఇల్లు చేరేసరికి నవ్వు మొహంతో ఎదురొస్తూ, మనసులో అనుకుంటే చాలు చెప్పకుండానే గ్రహించి అందుకనుగుణంగా మసులుకుంటూ ఇన్నాళ్ళూ గడిపి ఇప్పుడేమయ్యిందని ఇలా తయారయింది? ఆ లెక్చరర్ గాడిముందు, ఆటో తోలుకునే మొగుడు పనికిమాలిన వాడిలాగా కనిపిస్తున్నాడా?
          నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేసరికి పెట్టెలో బట్టలు సర్దుకుంటూ కనిపించింది కాంతి.  ' పోతే  ఫో ' అనుకున్నాడు తను కసిగా. పిల్లాడి హా ఫియర్లీ  పరీక్షలు ఇవాల్టితో అయిపోతాయి. పండక్కి పుట్టింటికి రమ్మని వాళ్ళ వాళ్ళు పిలిచారు. తనని కూడా పిలిచారు గాని తను వెళ్ళబోవడం లేదు.
      ఈ మధ్య కాలంలో తను అనుభవించినంత అశాంతి పెళ్ళైన ఆరేళ్ళలో ఎపుడూ అనుభవించలేదు. పెద్ద గొప్ప సంపాదన కాకపోయినా ఇన్నాళ్ళూ ఒకరికొకరుగా బతికారు. పరిచయస్థులేగాని తనకి వేరే చెప్పుకోదగ్గ స్నేహితులు లేరు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. ఉన్న ఒక్క అన్నగారితో పెద్ద సఖ్యత లేదు. మనసులోని ఆవేదన విప్పి చెప్పుకోగల దగ్గరి వాళ్ళెవరూ లేరు.
      నిన్న మధ్యాన్నం పెద్ద బజార్లో వెళుతుంటే డాక్టర్ త్రివిక్రమ రావు గారి క్లినిక్ కనిపించింది. ఆయనకి సైకియాట్రిస్టుగా మంచి పేరుంది. ఒక్కసారి చూడ్డానికి రెండొందలు పుచ్చుకుంటాట్ట! అసలు మానసిక సమస్యలకి డాక్టర్లు ఎలా చికిత్స చేస్తారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏమైనా ఉపశమనం దొరుకుతుందో లేదో తనకి తెలీదు. ఒక్కసారి వెళ్ళినంత మాత్రాన ఏమీ అవదనీ, అడపా దడపా అలా వెళ్తూనే ఉండాలనీ, వెళ్ళినపుడల్లా  రెండేసి వందలు సమర్పించుకోవాలనీ ఒకసారెపుడో ప్రకాశం అన్నాడు. ఆలోచించిన కొద్దీ పిచ్చిపట్టేలా వుంది!
      ఆటో లో కూర్చుని ఆలోచనల్లో మునిగి తేలుతున్న సూర్యారావు వేగంగా వచ్చి ఆగిన బస్సు శబ్దానికి ఉలిక్కి పడ్డాడు. బిలబిలా పది పన్నెండుమంది మంది దిగాక వెనకగా ఇద్దరు స్త్రీలు దిగడం కనిపించింది. ముందు దిగిన వాళ్ళంతా చిన్న చిన్న బాగులు చేత్తో పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
      చివరికి దిగిన ఆడవాళ్ళిద్దరూ మాత్రం రెండు పెద్ద పెట్టెలూ, సంచులతో ఆయాసపడుతూ దిగుతుంటే ముందుకెళ్ళి,"ఆటో కావాలామ్మా?" అనడిగాడు సూర్యా రావు.
     “తుక్కులూరు పోవాలి వస్తావా?" అడిగింది  ఇద్దరిలో  పెద్దామె.
      "వస్తానమ్మా " అన్నాడు సామాను అందుకుంటూ.
     సామాను ఆటోలో పెడుతుంటే ముందు ఏం తీసుకుంటావో చెప్పు " అంది చిన్నామె.  వెనక్కి   తిరిగి ఆమెని తేరిపార చూశాదు సూర్యారావు.
      ఐదారునెల్ల కడుపుతో వుందామె.
     "రోడ్డు మీదా ? ఊళ్ళోకి పోవాలా?"అడిగాడు.
     "అడ్డరోడ్డులో ఊరి దాకా  పోవాలి" అంది పెద్దావిడ.
     "డెబ్భై రూపాయలివ్వండమ్మా" అన్నాడు సంచులు కూడా లోపల సర్దేస్తూ.
      పెద్దామె ఓ నవ్వు నవ్వి "ఇంకా నయ్యంవంద అడిగావు కాదు" అంది.
      పండక్కి ఉండకుండా పుట్టింటికి పోతున్న భార్యా కొడుకూ గుర్తొచ్చి ఎవడికోసం సంపాదించాలి అనుకున్నాడు .
          "మీ ఇష్టమమ్మా ..డెబ్భై రూపాయలిస్తే వస్తా"”  అన్నాడు నిర్లక్ష్యంగా.
           "వద్దులే నాయనా .సామాను కింద పెట్టెయ్యి " అంది పెద్దామె.
            సామాను తీసి విసురుగా కింద పెట్టెశాడు సూర్యారావు.
           "ఈ బరువు దింపి ఆటోలో పెట్టినందుకే పదిరూపాయలు పుచ్చుకుంటారు" అన్నాడు చిరాగ్గా. చిన్నామె పొట్ట మీద రాసుకుంటూ రోడ్డు పక్కగా నిలుచుంది. 'వొట్టి మనిషి కాదని తెలిసి ఇష్టమొచ్చినట్టడుగుతారు  గొణుక్కుంది పెద్దామె.
           వాళ్ళని పట్టించుకోకుండా ఆటోలో కూర్చున్నాడు సూర్యారావు. అతనికి ఆడవాళ్ళందరి మీదా కోపంగా వుంది. 'లాంగ్ జర్నీ తర్వాత బాత్రూంకి పోవల్సి వుంటుంది. కాంతి చాలా అవస్థ పడేది ఆటైం లో' అని తలచుకున్నాడు. అస్థిమితంగా నిలుచున్న చిన్నామెని చూస్తూ 'అట్టాగే కష్టపడుఅనుకున్నాడు కసిగా. 
          'ఈమెకేమవుతుందో? కూతురో కోడలో' అనుకున్నాడు పెద్దామె వైపు చూపు పారేస్తూ.
         ' కూతురే అయి వుంటుంది.మొగుడితో దెబ్బలాడుంటుంది.వాడి మానాన్న వాణ్ణొదిలేసి రావే అని ఈవిడెళ్ళి కూతుర్ని వెంట పెట్టుకు తీసుకొచ్చి వుంటుంది. ఆ పిచ్చి వెధవ పండక్కి ఒక్కడే అక్కడ ఏడుస్తూ వుంటాడు. పెళ్ళాన్ని అతిగా ప్రేమించే వెధవలందరి గతీ అంతే' అనుకున్నాడు విరక్తిగా.
           అంతలోనే నవ్వొచ్చిందతనికిపుట్టింట్లో నాలుగు రోజులుండమని అతనే పంపాడేమో!  రెండ్రోజులాగి పండక్కి అతనూ అత్తారింటికెళ్ళి అరిసెలూ, పులిహారా, గారెలూ మెక్కుతాడేమో. బామ్మరిదినీ, పక్కింటి పిల్లల్నీ వెంటేసుకుని గాలిపటాలెగరేస్తూ పొలాల్లో షికార్లు తిరుగుతాడేమో ! తన గతి ఇలా వుందని అందరూ ఇలాగే వుంటారనుకోవడమెందుకు??’ అనుకున్నాడు .
         ఈలోపు పెద్దామె బాతు నడకతో కొంచెం ముందుకెళ్ళి ఇద్దరు ముగ్గురు రిక్షావాళ్ళని కదిపి చూసింది.
        "ఈ పెట్టెల్తో రిక్షాలో ఎట్టా కూచుంటామే?"  విసుక్కుంటూ ' ఈ రిక్షా ఎప్పటికెళ్ళేను ఇంటికి?'అని గొణుక్కుంది  చిన్నామె.
     బేరం కుదరలేదేమో  ఇంక తప్పదన్నట్టు పెద్దామె ఆటో దగ్గరకొచ్చి "యాభై ఇస్తాలే పదవయ్యా బాబూ" అంది.
    "రానమ్మా..డెబ్భైకి తక్కువకి రాను. గిట్టదు" నిర్లక్ష్యంగా అని " ఇంకా మాట్లాడితే ఎనభై అడుగుతా  ఆ సామానంతా ఎత్తి మళ్ళీ ఆటోలో పెట్టాలంటే " అన్నాడు.
      చిన్నామె కళ్ళెత్తి ఒక్కసారి సూర్యా రావు వైపు చూసింది.
    ' బుజాలనిండా బలం, ఆడదానిలా  శారీరకంగా అవస్థ పడాల్సిన అవసరం లేనపుడు అట్టా అనక ఎట్టంటావులే' అన్నట్టనిపించి చురుక్కుమంది సూర్యా రావుకి. ఒక్క క్షణం తప్పు చేసినవాడిలా చూపు తిప్పుకున్నాడు.
        "అరవయ్యిస్తాలే.. పద నాయనా. ఆడకూతుళ్ళు గదా అని ఎంత పడితే అంత అడగ్గూడదు బాబూ..." అంది పెద్దామె.
        మరో మాట మాట్లాడకుండా సామానెత్తి ఆటోలో పెట్టాడు సూర్యా రావు. ఆడవాళ్ళిద్దరూ ఆటో ఎక్కి సర్దుకుని కూర్చున్నాక  బండి తుక్కులూరు దారి పట్టించాడు. అడ్డదిడ్డంగా ఎదురయ్యే  ట్రాఫిక్ ని తప్పుకుంటూ ఆటో ముందుకు పోతుంటే తల్లీ కూతుళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు.
         ఊరి పొలిమేర దాటేసరికి మెల్లిగా మాట్లాడుకుంటున్నా, వాళ్ళ మాటలు ముందుకన్నా  స్పష్టంగా వినిపించసాగాయి .
         "అయితే  చివరికి  ఏంటంటాడూ? నాకేం అర్ధం కావట్లేదు" అంటొంది పెద్దామె.
         "ఎంత సేపూ ఒకటే మాట అమ్మా..ఆ తప్పిపోయిన సమ్మంధం ఎందుకు తప్పిపోయిందీ అంటాడు. 'ఎర్రగా బుర్రగా వున్నాడు వాణ్ణి మనసులో పెట్టుకుని, గతి లేక నన్నుకట్టుకున్నావ్'  అంటాడు. వాళ్ళొచ్చొచ్చి మా  వీధి లోనే కాపురం పెట్టడం నా చావు కొచ్చింది" ముక్కు ఎగ బీలుస్తూ అంటోంది చిన్నామె.
        "అంత చదువుకున్నోడికి ఇంతకన్నా బుర్రుంటుందనుకుని పొరపాటు పడ్డాం.. అయినా ఏడిస్తే యావవుతుందీ? నీకయినా తెలివిగా కాపరం చక్కదిద్దుకునే నేర్పు ఏడిసింది గాదు" అంది నిట్టూరుస్తూ తల్లి.
           అద్దంలోంచి వెనక్కి చూశాడు సూర్యారావు.
           చిన్నామె బుగ్గల మీదుగా కన్నీరు కారుతుంటే మాట్లాడ్డం ఇష్టం లేనట్టు బయటికి చూస్తూ కూర్చుంది.
        పెద్దామె నొచ్చుకున్నట్టు కూతురి బుజాల చుట్టూ చెయ్యేసి,"అదిగాదమ్మలూ.. అట్టాంటిదేవీ లేదూ..పదివేల కట్నం తక్కువైందని ఆళ్ళు లేచెళ్ళిపొయ్యారు. అంత కటిక వాణ్ణి నేనెట్టా ఇష్ట పడతానూ అని సముదాయించి చెప్పుకోవద్దా? అతను కోడి పుంజు మాదిరి ఎగిరి పడితే నువ్వూ అంత కన్నా ఎగిరెగిరి పడితే ఎట్టా నాన్నా?" అనునయంగా అంది పెద్దామె.
           బుస్సుమని తలెత్తి "ఎందుకు చెప్పాలమ్మా? ఎందుకు చెప్పాలీ?...ఎంత ప్రేమగా చూసుకున్నా ఇన్నాళ్ళూ? పెళ్ళైన వెంటనే టైఫాయిడొస్తే రాత్రీ పగలూ కాసుకున్నా. తగ్గాక ఏదడిగితే అది వొండి పెట్టా. నాలుగు నెలల్లో పాపాయి కూడా పుట్టబోతాంది. ఇంతేనా నాగురించి అతనికి తెల్సిందీ? రూపం వొక్కటే చూస్తారా ఎవరైనా? ఈ మగాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటే అంత నెత్తినెక్కి తొక్కేస్తారని తెలిసింది" అంది అమ్మలు కళ్ళు తుడుచుకుంటూ.
        "నేనొకటి చెబుతా ఇను చిన్నమ్మలూ! మగాళ్ళు పైకెంత కటువుగా ఉన్నా లోపల మనసు చిన్నపిల్లాడి మాదిరి  ఉంటదమ్మా.. నువ్వే మంచోడివి. నువ్వే అందమైనోడివి అని మెచ్చుకుంటా వుండాలి. అవుతలోడు  తనకన్నా బాగున్నాడనో, ఎక్కువ సంపాదిస్తాడనో ఆణ్ణి  ఇష్టపడతాదేమో పెళ్ళాం అని బెంగా, దిగులూ ఉంటై కొంత మందికి."
           తల్లి మాట పూర్తి కాకముందే అందుకుని "ఆ..సిగ్గులేకపోతేసరి! పక్కింటామె నీకన్నా తెల్లగా అందంగా వుంది కదా అని ఆమే మా అమ్మ ఐతే బావుణ్ణనుకుంటానా? శ్రీనివాసులు బాబాయికి నాన్న కన్నా ఎక్కువ డబ్బుండాదని ఆయనే మా నాన్న అయితే బావుండేదనుకుంటానా? తాళికట్టించుకుని, యాడాదిగా అతనే లోకవని బతికి ఆయన బిడ్డకి తల్లి కాబోతూ, పదివేల కట్నం తక్కువైందని పీటల మీంచి లేచెల్లిపోయిన ముదనష్టపు ఎదవని మనసులో పెట్టుకుంటానా? రేపు పుట్టే పాపాయి అందంగా లేకపోతే దాన్ని తోసేసి పక్కింటోళ్ళ పాపాయిని ఎత్తుకోని ముద్దులాడతానా? ఈ మగాళ్ళకి బుర్రలుండవా? మాటనేముందు ముందూ ఎనకా అలోసించరా? .థూ" అంది అమ్మలు.
              సూర్యా రావుకి కొరడాతొ ఛెళ్ళున కొట్టినట్టయింది.
             వాళ్ళ పెళ్ళై ఇంకా యాడాదే…….తన పెళ్ళై ఆరేళ్ళయింది. స్కూలుకెళ్తున్న కొడుకున్నాడు! భార్యనర్ధం  చేసుకోడంలో తనే పొరపాటు చేశాడా?
           "అట్టా చికాకు పడితే ఎట్టా చిన్నమ్మలూ? మొగోడు అనుమానపడ్డా ఆడది సముదాయిచ్చి చెప్పాలి గాని, అతనొక మాటంటే ఆవె పది మాటలని ఈదిన బడితే ఎవురికి నష్టం చెప్పూ?"అంది తల్లి.
           "అవున్లే..రాముడి కాలం నించీ పెళ్ళాన్ననుమానించడంలో తప్పేం లేదనీ, మొగోడికి పెళ్ళాం శీలమ్మీద అనుమానవొస్తే తను నిప్పులాంటిదని నిరూపించుకునే అవుసరమూ, బాద్యతా ఆడదానిదేననీ  పద పద్దాక చెపుతూ వొచ్చారుగా మీరంతా..కాపురం పోతుందేవో అనే బయం ఆడదానికే ఎందుకుండాలో నాకర్దం కావట్లేదమ్మా? నేను చావనైనా చస్తాను గాని నువ్వన్నట్టు సముదాయిచ్చి చెప్పను గాక చెప్పను" రోషంగా అంది అమ్మలు.
            "ఏ మాట బడితే ఆమాట అనబాక తల్లీ.ఒక్కగానొక్క బిడ్డ మాకు బరువుగాదు. నువ్వెళ్ళిన్నాటినించీ ఇల్లంతా బోసిపోయింది. ఏదో అక్కడ సుకంగా వున్నావని అనుకుని సర్దుకున్నాం గాని……… సర్లే ఇప్పుడే నాన్న కేం చెప్పమాకు . మెల్లగా నేనే టయం చూసుకోని చెపుతా.సరేనా?"వీపు మీద రాస్తూ అంది తల్లి. 
      ఆటో తుక్కులూరు అడ్డరోడ్డు చేరింది. మలుపు తిప్పి గతుకుల రోడ్డు మీద నెమ్మదిగా పోనిచ్చాడు సూర్యారావు, అమ్మలుకి ఇబ్బంది కలక్కుండా. అటూ ఇటూ పొలాల్లో వరి కుప్పలూ, కోసిన వరి మొదళ్ళూ పసిడి వర్ణంలో  మెరిసి పోతున్నాయి. మధ్యలో అక్కడక్కడ కారబ్బంతి పూల తోటలు, ఆకుపచ్చని తివాచీ మీద ఎర్రపూలు పరుచుకున్నట్టు కాంతులీనుతున్నాయి. ఎక్కువ వెడల్పు లేని మట్టి రోడ్డు గతుకుల మీద ఆటో ఎగిరిపడుతోంది. పైరగాలి ఆటో లోకి రివ్వుమంటూ వీచింది.
           వేగం తగ్గిస్తూ చలిగాలి కొడ్తోంది..షాలు కప్పుకో చెల్లెమ్మా " అన్నాడు అప్రయత్నంగా.
          అమ్మలు ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ భుజాన వున్న షాలు పూర్తిగా కప్పుకుంది.
        "చలిగాలికి జలుబు చెసిందంటే ఓ పట్టాన తగ్గి చావదు. ఇ ట్టాంటప్పుడు మందులేసుకునేది అంత మంచిది గాదు" అన్నాడు ఎదురొచ్చిన గంగిరెడ్ల వాళ్ళని తప్పిస్తూ.
        "అట్టా చెప్పు నాయనా!" అని "అదుగో ఆ ఎత్తరుగుల పెంకుటింటి ముందు ఆపు బాబూ" అంది పెద్దామె. గతుకుల్లో పడకుండా జాగ్రత్తగా పోనిచ్చి ఇంటి ముందు పెట్టిన ముగ్గు పాడవకుండా, గొబ్బిళ్ళకి చక్రాలు తగలకుండా గోడ పక్కగా ఆపాడు సూర్యారావు.
        "అమ్మా..ఆయనకి ఎనభై  ఇచ్చెయ్యి..బేరాలాడకు" అంటూ చేతిసంచీ ఒకటీ పట్టుకుని హడావుడిగా ఇంట్లోకి వెళిపోయింది అమ్మలు.
           "అబ్బో అంత కోపమా చెల్లెమ్మా?" అంటూ సామాను ఇంటి అరుగు మీద పెట్టాడు సూర్యారావు. అరుగు పక్కనే నిలుచుని రొంటినుంచి పర్సు తీసి చిల్లర నోట్లు లెక్క పెడుతున్న పెద్దామెని చూడ నట్టుగా ఆటో వెనక్కి తిప్పుకుని వేగం పెంచాడు.
          "ఏందయ్యో! డబ్బులు తీసుకోకండా పోతన్నావూ?" అంటూ పెద్దామె అరిచింది.
           "చెల్లెమ్మకింకా నేనే ఇవ్వాలిలే పెద్దమ్మా..డాక్టర్ ఫీజ్" నవ్వుతూ అంటూ, రివ్వుమని ఆటోని ముందుకి పోనిచ్చాడు సూర్యారావు.
          తెల్లబోయి నిలుచున్న పెద్దామె, వెనకే వచ్చి నిలుచున్న భర్తతో "ఏంటంటాడూఅట్టా పోతన్నాడేంటి కిరాయి తీసుకోకండా?" అంది.
            "ఏంటో డాక్టర్ ఫీజంటన్నాడు" అన్నాడాయన వింతగా చూస్తూ.
             "ఏంటేంటీ? మన బిడ్డకి డాక్టర్ ఫీజు మనవిచ్చుకోలేవా? ఆడికేవన్నా పిచ్చెక్కిందా?"అందామె కోపమూ చిరాకూ కలగలిపిన స్వరంతో.
         మబ్బుల రజాయి దట్టంగా కప్పేసినా, విధి నిర్వహణలో తనని మించిన వాళ్ళు లేరని నిరూపిస్తూ బారెడెత్తున నవ్వుతూ నిలుచున్నాడు సూర్యుడు. మలుపు తిరిగి మెయిన్ రోడ్డెక్కుతుంటే దారి పక్కన చెట్టు నిండుగా ఫక్కుమంటున్న పున్నాగలు పరిమళాలు రువ్వాయి. పెళ్ళయ్యాక అత్తగారింట్లో మొదటి పండక్కి,  ఆ పూలతో వంకీ జడేసుకుని, తన వైపు వోరగా చూసిన కాంతి కళ్ళలో తళుక్కుమన్న అనురాగం గుర్తొచ్చి మోహపరవశుడయ్యాడు సూర్యారావు.
       'ఎంత దూరవనీ ముఫై కిలోమీటర్లు! ఆటో లోనే పోవచ్చు ముగ్గురంఅక్కడ ఊళ్ళో తిరిగేందుగ్గూడా ఆటో చేతిలో వుంటది' అనుకున్నాడు హుషారుగా.


                                                             ***

                                             (27 నవంబర్,2013, నవ్య వారపత్రిక)

                                                                                                                    


                                                                                                                    ***

October 1, 2013

మానవాళికే పండుగరోజు - గాంధీజీ పుట్టినరోజు


పుట్టినరోజు పండగే అందరికీ—మరి
పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?
                                       అంటూ ఒక గానకోకిల తీయగా ప్రశ్నిస్తే జవాబివ్వడం అంత తేలికేం కాదు. తమ పుట్టుక వల్ల ప్రపంచానికేమీ ఒరగకపోయినా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. పారతంత్ర్యంలో మగ్గుతున్న కోట్లమంది జీవితాలలోకి వెలుగురేకలని , స్వేఛ్ఛావాయవుల్ని ప్రసరింపజేసి, అసంఖ్యాకుల హృదయ మందిరాలలో సుస్థిరంగా నిలిచిపోగల మహనీయులు మాత్రం అరుదుగా జన్మిస్తారు. వారి పుట్టినరోజెప్పుడో వారికక్కర్లేదు. వారి దృష్టంతా లోకహితంపైనే. నిరంతరం మానవసేవలో తలమునకలుగా జీవించి తమ లక్ష్యసాధనలోనే వారు తనువు చాలిస్తారు. వాళ్లు చిరాయువులు ! వారి పుట్టినరోజు వేడుకలు కోట్లాది సజ్జనుల హృదయాలలో ఏటేటా జరుగుతూనే ఉంటాయి!

             అత్యంత సాధారణమైన రూపం వెనుక అనుక్షణం తనను తాను ఉన్నతీకరించుకోగల అంతరంగాన్నిదాచుకుని, తన జీవిత పరమార్ధమేమిటో తెలుసుకుని, తన లక్ష్యాన్ని నిర్ధారించుకుని, ఆ లక్ష్యసాధనలో అలుపులేని ప్రయాణం సాగించి, తాను ఆరాధించిన పురాణపురుషుల సరసన నిలబడగలిగే వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని సంపాదించుకున్న మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ పుట్టినరోజు, భారతీయులకే కాదు ప్రపంచ ప్రజలందరికీ పండుగరోజే ! మానవాళి మనుగడకి, శాంతి సౌభ్రతృత్వాల, సత్యమూ, అహింసల ఆవశ్యకతని చాటిచెప్పిన గాంధీగారి జన్మదినమైన అక్టోబరు రెండవ తేదీని గాంధీజయంతిగా భారతీయులంతా జరుపుకుంటే ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’ గా వందకు పైగా దేశాలు పాటిస్తున్నాయి.

          మహాత్ముడుగా, జాతిపితగా భారతీయులందరికీ చిరస్మరణీయుడై, ప్రాత:పూజనీయుడైన బాపూజీ పుట్టిన తేదీ అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా యునైటెడ్ నేషన్స్ లోని 114 సభ్యదేశాలు తీర్మానించడంచూస్తే ఈ అణుయుగంలో అహింస ప్రాముఖ్యత ఎంతో అర్ధమౌతుంది. హింసను నమ్ముకున్నవారు ఆ హింసకే బలికాక తప్పదన్నది చరిత్ర నేర్పిన పాఠం. ప్రపంచంలో ఎక్కడ హింస చెలరేగినా గాంధీ తత్త్వం, అహింసా మార్గం చర్చకు వస్తాయి. అసాధారణమైనవి ఆయన అనుభవాలు కాదు, ఆ అనుభవాలకి ఆయన ప్రతి స్పందన ! సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో ఆయన చేసిన పోరాటాల్లోని సాహసాన్ని, త్యాగాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, ఆయన పుట్టిన రోజుని అంతర్జాతీయ అహింసా దినోత్సవం, మానవ హక్కుల దినం, సత్యాగ్రహ దినోత్సవంగా నిర్వహించాలని సూచించింది. దీంతో భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా గాంధీ జయంతి ఒక పండుగరోజైంది.

         బాపూజీ భారతీయులకందించిన వారసత్వ సంపద అమూల్యమైనది. శతాబ్దాలపాటు భరతజాతిని దాస్య శృంఖలాలలో బంధించిన బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి ఆయన ఎన్నుకున్న ఆయుధాలు సహాయ నిరాకరణ , సత్యాగ్రహాలే . అహింసా మార్గంలో రెండు శతాబ్దాల సుదీర్ఘ దాస్యానికి చరమగీతం పాడి, భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించడమనేది చరిత్రలోనే ఒక అపూర్వ సంఘటన . అంతవరకూ ప్రపంచంలో రాజ్య విస్తరణ కోసం, లేదా తమ రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం ఎంతటి రక్తపాతానికైనా వెనకాడని పాలకులే మనకు తెలుసు. శాంతి కాముకులైన రాజులు కూడా అవసరార్ధం యుద్ధాలకు సిద్ధపడడం కొత్త విషయం కాదు. ‘విజయమో , వీరస్వర్గమో’ అన్న నినాదం ధీరత్వానికి చిహ్నం గా వాడేవారు. అనాదిగా పాతుకుపోయిన ఆ భావజాలపు ఒత్తిడి నుంచి తప్పించుకుని ఒక కొత్త సిద్ధాంతాన్ని ఏర్పరచుకోవడమే గొప్ప అనుకుంటే తన చుట్టూ పెల్లుబుకుతున్న ఆగ్రహ జ్వాలలను నిలవరించి, భౌతిక వాదులకు అర్థంకాని ఆత్మగతమైన ప్రభంజనాన్ని సృష్టించి, లక్ష్య సాధనకొక కొత్త ఒరవడి చుట్టడం గాంధీజీ సాధించిన అసాధారణ విజయం.

        గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా, పోరు బందర్ సంస్ధానంలో దివాన్ గా పని చేసే కరంచంద్ గాంధీ, హిందూసంప్రదాయాలను శ్రద్ధతో పాటించే సాధ్వీమణి పుత్లీ బాయిలకు 1869 అక్టోబర్ 2 వ తేదీన జన్మించారు. గాంధీజీ చదువులో చురుకైన విద్యార్థి కాదు. ఆయన ప్రాథమిక విద్య రాజ్‌కోట్‌లో, ఉన్నత విద్య కథియ వాడ్‌లో కొనసాగింది. విద్యార్థి దశలో ఉండగా ఒకసారి ఆ పాఠశాలకు పరీక్షాధికారి వచ్చి విద్యార్థులను పరీక్షించడం జరిగింది. గాంధీజీ జవాబులు రాయలేకపోవడంతో ఆ సమయంలో ప్రక్కనున్న విద్యార్థి జవాబులను చూసి రాయమని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాడు. అయితే గాంధీజీ ఇందుకు నిరాకరించారు.

        మెట్రిక్యులేషన్ పాసయ్యాక ఉన్నత చదువుల నిమిత్తం గాంధిజీ ఇంగ్లాండ్ వెళ్ళి, న్యాయవాద విద్యను అభ్యసించారు. తరువాత దేశానికి తిరిగొచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టి మూడేళ్ళపాటు బొంబాయి, రాజ్కోట్‌లలో ప్రాక్టీసు చేశారు. 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళిన గాంధీజీ 20 సంవత్సరాలకు పైగా అక్కడే నివాసమున్నారు. అక్కడ జాతి వివక్షకు గురై అవమానాలనెదుర్కొన్నారు. ఆ అవమానాలే ఆయనలోని నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటింపచేశాయి. 1915 జనవరి 9 వ తేదిన దక్షిణాఫ్రికా నుండి భారత దేశానికి తిరిగి వచ్చి, 1916 లో అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమాన్ని స్దాపించారు. సత్యాచరణ, అహింసా మార్గాన్ని అనుసరించవలసిన విధానమూ తన అనుచరులకు బోధించారు. 1916 ఫిబ్రవరి 4 న కాశీలో హిందూ విశ్వ విద్యాలయం లో ప్రసంగించిన గాంధీజీని మొదటిసారిగా రవీంద్ర నాథ్ ఠాగూర్ మహాత్మా అని సంబోధించారు.

        భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రత్యేక పాత్ర పోషించిన సత్యాగ్రహం మొదటిసారిగా 1916లో బీహారు లోని చంపారన్ జిల్లాలో జరిగింది. అయితే అప్పటికి ఈ నిరసన వ్రతానికి సత్యాగ్రహమనే పేరు పెట్టడం జరగలేదు. బీహార్ లో తీన్ కథియా అనే పద్ధతి వల్ల రైతులు, తమ భూముల్లో పండించిన పంటను బ్రిటిష్ తోటల యజమానులు నిర్ణయించిన ధరకు వారికే అమ్మాల్సి వచ్చేది. దీంతో రైతులు తోటల యజమానుల అణచివేత చర్యలకు గురయ్యేవారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేపట్టిన ఉద్యమాలను గురించి విన్న చాలా మంది చంపారన్ రైతులు తమ ప్రాంతానికి వచ్చి కాపాడమని ఆయనను ఆహ్వాంచారు.

        గాంధీజీ చంపారన్ లో ఆశ్రమాన్ని స్ధాపించి అక్కడ జరుగుతున్న అక్రమాలు, అన్యాయాల పై తన అనుయాయులతో, స్ధానికులతో ఒక సర్వే జరిపించారు. అక్కడి వారి విశ్వాసాన్ని గెలుచుకుని ఆ గ్రామాలలో సంస్కరణ కార్యక్రమాలు ప్రారంభించారు. విద్యాలయాలు, వైద్యశాలలు నిర్మించి, పర్దా పద్ధతిని, అస్పృశ్యతను, స్త్రీలపై అణచివేతను నిర్మూలించేలా కృషిచేశారు. అక్కడి స్దానికుల్లో అలజడికి కారకుడవుతున్నారన్న కారణం చూపి ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. గాంధీజీ విడుదల కోసం లక్షలమంది జనం, జైళ్లముందు, పోలీస్ స్టేషన్ల ముందు, కోర్టుల ముందు నిరసనకు దిగడంతో తీన్ కథియా పద్ధతి రద్దు అయ్యింది. గాంధీ సాధించిన ఈ విజయం, నెహ్రూతో సహా అనేక అనేక మంది యువ జాతీయ వాదులను ఆకర్షించింది. ఆయన ఆదర్శవాదం, ఆచరణాత్మకమైన రాజకీయ దృక్పథం వారిని ఆకట్టుకున్నాయి.

         అలాగే గుజరాత్ లోని ఖేదా జిల్లాలో పంటలు పండక పోయినప్పటికీ పన్నులు చెల్లించమని రైతులను వేధిస్తున్న అక్కడి రెవిన్యూ అధికారుల చర్యలకు నిరసనగా 1918 లో గాంధీజీ సత్యాగ్రహం ప్రారంభించారు. బాధిత రైతులంతా కలిసికట్టుగా కనపరిచిన ఐక్యతా, క్రమశిక్షణా, సత్యాగ్రహంలో పాల్గొంటున్న రైతులకి స్ధానికులందించిన ఆశ్రయం ప్రభుత్వాన్ని నివ్వెరపోయేలా చేశాయి. జప్తు చేయబడ్డ పొలాలను కొన్నవారిని అక్కడి సమాజం వెలివేసింది. బాధిత రైతులకు వారి వారి పొలాలు తిరిగి లభించే దాకా గుజరాతీలంతా కలిసికట్టుగా పనిచేయడంతో ప్రభుత్వం స్పందించి పన్నులను రద్దు చేయక తప్పలేదు. ఇదే సంవత్సరంలో అహ్మదాబాద్ మిల్లు పనివారి వేతనాలు పెంచాలని సత్యాగ్రహం చేపట్టి, మిల్లు యజమానులను అంగీకరింప జేసి, కార్మికుల వేతనాల్లో 35 శాతం పెరుగుదలకు కారకుడయ్యారు గాంధీజీ. స్ధానికంగా తను చేపట్టిన సత్యాగ్రహ ప్రయోగాలలో విజయాన్ని సాధించిన తర్వాత గాంధీజీ దృష్టి జాతీయ సమస్యల వైపు మళ్లింది.

         విచారణ లేకుండానే ఎవ్వరినైనా అదుపు లోకి తీసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రౌలత్ చట్టాన్ని చేసింది. గాంధీజీ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా అరెస్టై జైలుకు వెళ్లాలని సూచించారు. ఈ పిలుపుకు స్పందించిన దేశ ప్రజలు ఉత్సాహంతో కదలి వచ్చారు. 1920 లో నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సభ, గాంధీజీ ప్రవేశ పెట్టిన సహాయ నిరాకరణోద్యమ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీతో సహా చాలా మంది నాయకుల్ని నాటి ప్రభుత్వం నిర్బంధించింది. అనంతరం వెల్లువెత్తిన స్వాతంత్య్ర సమర జ్వాలలకి తలవొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగష్టు 15 న భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. అభివృద్ధి పథంలో స్వతంత్ర భారతం సాగించదలచిన ప్రయాణాన్ని చూడక ముందే, 1948 జనవరి 30 న నాథూరాం గాడ్సే తుపాకీ గుళ్లకు గాంధీజీ బలయ్యారు.

          అత్యంత నిరాడంబరుడైనా జాతి యావత్తునూ ఒక్క తాటిపైన నడిపించగల సమ్మోహన శక్తి ఆయన సొంతం. అచంచలమైన ఆత్మవిశ్వాసం, అలుపెరుగని పోరాట పటిమ, స్వాతంత్ర్య సముపార్జన కోసం ఆయన ఎన్నుకున్న మార్గం విశిష్టమైన ఆయన వ్యక్తిత్వాన్ని చాటిచెపుతాయి. తన జీవితాన్ని తెరిచిన పుస్తకంగా చేసి తన భావాలను, భవిష్యత్ ప్రణాళికలను భారతీయులందరితో పంచుకుంటూ దేశమాత స్వేఛ్ఛ కోసం పోరు సాగించిన ఆయన శాంతియుత సమర వ్యూహం నేతలందరికీ అనుసరణీయమైంది. కనకవర్షాన్ని కురిపించగల న్యాయవాదవృత్తిని వదిలేసి దేశభవిత కోసం తన సర్వస్వాన్నీ సమర్పించిన మహాత్ముడి జీవితం ఆద్యంతమూ ఆదర్శప్రాయమే. సత్యానికి అఖండమైన, అనంతమైన శక్తి ఉందని నమ్మిన ఆయన, నిరంతర సత్యశోధనలో జీవనయానం సాగిస్తూ తన జీవితాన్నేఒక సందేశంగా భావితరాలకందించారు. ఆయన అందించిన ఆ మహా సందేశం కేవలం భారత జాతికే కాక విశ్వ మంతటికీ దారి చూపగల దివ్యతేజం, విశ్వ శాంతికై ఎగరేసిన శ్వేత కేతనం. కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టు

            'కమ్మగా బతికితే గాంధీయుగం , మనిషి కడుపునిండా తింటే గాంధీ జగం

            మనిషి శివుడవడమే గాంధీయుగం, బాపు ననుసరిస్తే చాలు మనమందరం''

          1918 లోనే హిబ్బర్ట్ జర్నల్ లో గిల్బర్ట్ ముర్రే అనే మేధావి, గాంధీజీ గురించి ఈ విధంగా రాశాడు “సాధారణ వ్యక్తుల్ని పిరికివారుగా మార్చేసే రాజకీయ వాతావరణంలో గాంధీజీ అసాధారణ వ్యక్తిత్వం శృంఖలాలు తెంచుకుంది. భౌతిక సుఖాలని , ఐశ్వర్యాన్ని, పదవిని ఖాతరు చేయని, పొగడ్తలకు లొంగని, తాను నమ్మినదాన్ని ఆచరించితీరాలనే దృఢనిశ్చయంతో ఉన్న వ్యక్తితో వ్యవహరించేటపుడు అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అతనొక ప్రమాదకరమైన, ఇబ్బందికరమైన శత్రువు.. ఎందుకంటే అతని శరీరాన్నేగాని అతని ఆత్మని జయించడం ఎవరికీ సాధ్యంకాదు “

         మనసా వాచా ఆస్తికుడైన గాంధీజీ భగవత్సక్షాత్కరం కోసం గుహలలో తపస్సు సాగించకుండా , తనకవసరమైన తపో మందిరాన్ని తన అంతరంగంలోనే నిర్మించుకోవడం భారతీయులంతా చేసుకున్న పుణ్యమని చెప్పచ్చు. చరిత్రలో గాంధీజీ స్ధానం ఏమిటో అప్పుడే నిర్ణయించడం సాధ్యం కాదని చరిత్రకారుల భావన. అభివృధ్ధి చెందని దేశాలలో చెలరేగుతున్న కల్లోలాల దృష్ట్యా, పేద ధనిక వర్గాల మధ్య చోటు చేసుకుంటున్న సామాజిక అసమానత, అసూయ , ఆవేశ కావేషాల దృష్ట్యా, కళ్లాలు లేని సాంకేతిక విప్లవం పరుస్తున్న నీడల దృష్ట్యా , ప్రపంచమంతటా అణుశక్తి నీడలో అల్లల్లాడుతున్న శాంతి భద్రతల దృష్ట్యా గమనిస్తే, రానున్న కాలంలో గాంధీ తత్త్వమూ, ఆయన ఆలోచనలు, మార్గదర్శక సూత్రాలూ మరింత ప్రాముఖ్యతని సంతరించుకుంటాయన్నది నిర్వివాదాంశం.

         తన మేధాశక్తితో ప్రపంచాన్ని దిగ్భ్రమపరచిన ఐన్ స్టీన్ “ గాంధీ లాంటి మహాపురుషుడు ఈ భూమిపై నడిచాడంటే భావితరాలు నమ్మకపోవచ్చు” అనడం, అలాంటి అసాధారణ దేశభక్తుల త్యాగ ఫలాలని అనుభవిస్తూ కూడా వారి మరణానంతరం వారిపై బురద జల్లే స్వార్ధజీవులకు అర్ధం కాని విషయం ! తమ స్వంత నియోజక వర్గంలోనైనా అడుగు ముందుకు వేయాలంటే భద్రతా దళాల పై ఆధారపడే ప్రజా ప్రతినిధులూ, ప్రజాస్వామిక దేశంలో నివసిస్తూ కూడా ఓట్లను మురగబెడుతూ, అల్లర్లూ, మారణకాండలు జరిగినపుడు మాత్రం ప్రభుత్వాన్ని తూర్పారబట్టే పౌరులూ, గాంధీజీ లాంటి యుగపురుషుడిని అర్ధం చేసుకోలేకపోవడం వింతేమీ కాదేమో ! నిరంతరం టీవీ తెరలకతుక్కుపోయి అందులో కనిపించే అసహజత్వానికి అలవాటు పడిపోయిన జనానికి , అణువణువునా జాత్యహంకారం నిండిపోయి నిరంకుశులైన బ్రిటిష్ వారి కబంధహస్తాలనించి దేశమాతకు దాస్యవిముక్తిని కల్పించడం గొప్ప విషయంగా తోచకపోవచ్చు ! ఓ చెంప పగలగొడితే మరో చెంపచూపిస్తూ, ఎడతెగని లాఠీ దెబ్బలకు రక్తమోడే శరీరాలనప్పగించి ‘వందేమాతర’మంటూ నినదించే శక్తి వారికి ఎలా వచ్చిందో నేటి తరానికి అర్ధం కావడం కష్టం.

         ఏ అధికారపు ఆధిపత్యాన్ని గాంధీ నిరసించారో అదే అధికార దర్పం, ఆధిపత్యం దేశంలో ఈనాడు రాజ్యమేలుతోంది. ‘పాలకులు, పాలక పార్టీలు ప్రజలను శాసించే స్థాయికి చేరుకోవడం అత్యంత విషాదకర పరిణామమనీ, పార్టీ అనేది అధికార కేంద్రంగా తయారై ప్రజలపై నియంతృత్వం చేస్తుందనీ‘ ఆయన ఆనాడే హెచ్చరించారు. భారత జాతి మొత్తం చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా వచ్చిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కాంగ్రెస్ పార్టీ తన సొంత జాగీరుగా మార్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గాంధీ భయాలన్నీ ఈనాడు నిజమయ్యాయి.

         గ్రామ స్వరాజ్యాన్ని కోరుకుని పారిశ్రామికీకరణను వ్యతిరేకించిన ఆయన మాతృభూమిలో ఈనాడు విచ్చలవిడిగా పారిశ్రామికీకరణ జరిగిపోతోంది. చేత రాట్నం పట్టి , చేనేతను మన స్వాతంత్ర్య పోరాట సాధనంగా , సాధికారతా చిహ్నంగా పరిగణించిన గాంధీ పుట్టిన దేశంలో నేత పనివారికి భుక్తి కరువై ఆత్మహత్యలకు పాల్పడే అగత్యమేర్పడింది. స్వదేశీ ఉద్యమాన్ని మనసా వాచా బలపరచి, దేశక్షేమానికి, పురోగతికి స్వదేశీ వస్తువుల ఉత్పాదకత, వినియోగం అవసరమని ఉద్ఘాటించిన నేలపైన గ్లోబలైజేషన్ పుణ్యమా అని చైనా బజార్లు చెలరేగిపోతున్నాయి. డాలర్ షాపులు ధగధగ లాడుతున్నాయి. ఆడంబరాలకు ఆమడ దూరంలో నిలచిన ఆయన దేశీయులిపుడు ఆధునాతన విదేశీ వస్తువుల కోసం , వాహనాలకోసం తహతహలాడుతూ ఎంత ధరైనా చెల్లించడానికి సిధ్దపడుతున్నారు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వమైతే ఆయన వారసత్వాన్ని ఎలుగెత్తి చాటుకుంటోందో ఆ ప్రభుత్వమే మంచినీళ్లు దొరకని గ్రామాల్లోనైనా మద్యం మాత్రం నిరంతరాయంగా దొరికేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ గ్రామ సీమలు సర్వతోముఖాభివృధ్ధిని సాధించాలని ఆయన ఆరాట పడ్డారో ఆ గ్రామాలలో పంటపొలాలన్నీ చేపల చెరువులై వొట్టిపోయాయి. సెజ్ లు గా మారి అన్నదాతల జీవనోపాధిని ఛిద్రంచేసి, పసిడి కాంతుల ధాన్యాగారాలను, గుప్పిట్లో ఇమిడిపోయి చిటికెలో కరిగిపోయే నోట్లకట్టలుగా మార్చేస్తున్నాయి. ఏ స్వయం సమృధ్ధి జీవగర్రై మనని కాపాడుతుందని ఆయన నొక్కి వక్కాణించారో ఆ స్వయం సమృధ్ధి విఛ్ఛిన్నమయేలా నేడు ఆహార పంటలపై జెనెటిక్ మోడిఫికేషన్ జరిగి, ఆ పంటలు స్వార్ధపరుల కుట్రల కారణంగా దేశీయ పంటల్లోకి చొచ్చుకు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వాల హ్రస్వ దృష్టి కారణంగా మన అన్నదాతలు, వారి వెంటే మనమూ విదేశీ విత్తన కంపెనీల వలల్లో చిక్కుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం ! మహాత్ముని పుట్టినరోజు, కార్యాలయాలన్నిటికీ సెలవు రోజై , ‘వర్క్ ఈజ్ వర్షిప్’ అన్న జాతిపిత సందేశానికి వ్యతిరేకంగా ఉత్పాదకతకు కళ్లెం వేస్తోంది. ఆర్ధిక మాంద్యంతో తల్లడిల్లుతున్న దేశంలో ఇక ఈ ప్రత్యేకదినాన్ని తలుచుకుని సంబరపడేందుకేం మిగిలింది ??

         శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల మన జీవినవిధానం ఎంతో ప్రభావితమైంది. సమాజంలో ఎంతటి మార్పులు చోటుచేసుకున్నా, గాంధీ జీవన విధానమే ఇప్పటికీ ఆదర్శప్రాయమని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. స్వాతంత్య్ర సమరంలో ఆయన ఎంచుకున్న 'అహింస' ఆయుధమే ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలకు వజ్రాయుధమై, విజయసాధనమవడం గాంధీజీ దార్శనికతకు ఉదాహరణ.

              చిక్కని చీకటిని నిరసించే గొంతులెన్నో, చక్కని వెలుగిచ్చే మౌన దివ్వెలు కొన్నే!

              కీర్తి కాంతుల్లో వెలిగి పోయేవారు ఎందరో, స్ఫూర్తి కిరణాల వెలుగై నిల్చే వారు కొందరే !

         శ్రీనివాస్ నాగులపల్లి గారు కవిత్వీకరించినట్టు, చిక్కని చీకటిలో స్వయంప్రకాశమై , మౌన దీపమై, స్ఫూర్తి కిరణపుంజమై ధగధ్ధగాయమానంగా వెలిగి, అజరామరమై నిలిచిపోయిన బాపూజీ పుట్టినరోజు మానవాళికే పండగరోజు. ‘అర్ధరాత్రి స్త్రీ నిర్భయంగా సంచరించగలిగిన నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టుగా భావిస్తా’నన్న బాపూజీ, మళ్లీ జన్మిస్తే, భారతంలో ప్రతిరోజూ చోటుచేసుకుంటున్న అత్యాచార పర్వాలనుంచి, తాను కోరిన నిజమైన స్వాతంత్ర్యసాధనకి మార్గనిర్దశనం చేసేవారేమో!


August 10, 2013

నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం !

                              

      
              

  "చాలా కాలం క్రితం  మన భవితవ్యాన్ని మనమే నిర్ణయించుకుందుకు సన్నధ్ధులమయ్యాం. ఇప్పుడా సమయం వచ్చింది.  ప్రపంచం యావత్తూ నిద్రలో మునిగినప్పుడు, అర్ధరాత్రి పన్నెండు కొట్టగానే స్వతంత్ర భారతి చేతన పొంది మేల్కొంటుంది ! పాత నుంచి కొత్త లోకి మనం అడుగు పెట్టే క్షణం, ఒక యుగం అంతమై , ఎంతో కాలంగా అణచివేయబడ్డ ఒక దేశపు ఆత్మ, గొంతు పెగల్చుకుని, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ఇటువంటి క్షణం, చరిత్రలో అరుదుగా వస్తుంది ! మనమంతా భారత దేశం కోసం, దేశ ప్రజల కోసం, అంతకు మించి మానవ జాతి కోసం అంకిత మవుతామనే ప్రతిజ్ఞ పూనేందుకు సరైన సమయం ఈ పవిత్ర క్షణమే!“ 
       అన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ మాటలు  ( ప్రసిద్ధమైన Tryst with destiny ప్రసంగం )  క్రిందటి తరం లోని ప్రతి వ్యక్తికీ మరపురాని మథుర వాక్యాలు. 
        రెండు వందల సంవత్సరాల ఆంగ్ల పరిపాలనలో తమ  స్వేచ్ఛాస్వాతంత్ర్యాలనూ, జవసత్త్వాలనూ కోల్పోయిన భారతీయులంతా తమ శరీరాల్లోని ప్రతి అణువునూ ఒక చెవిగా చేసుకుని ఆ శుభ వార్త కోసం  ఎదురు చూశారు. ఎడతెగని తుఫాను తాకిడికి నేలవాలిన మహావృక్షపు  శిథిల శేషాల నుంచే సరికొత్త చిగుళ్లు మొలకలెత్తినట్టుగా ఒక కొత్త భారత జాతి జీవం పోసుకుంది. పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పధ్నాలుగవ తేదీ నాటి అర్ధరాత్రి , తెల్లవారితే  పదిహేను అనగా మన భారతావని స్వతంత్ర రాజ్యంగా అవతరించింది.          
        ప్రపంచంలోని అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం పుట్టిన రోజుగా ఆగస్టు 15 వ తేదీ గొప్ప ప్రాముఖ్యతని సంతరించుకుంది. లక్షలాది దేశభక్తుల త్యాగాల ఫలంగా లభించిన ఈ వరాన్ని దేశప్రజలంతా హర్షాతిరేకంతో స్వాగతించారు. అంతటి ఆనందానికి , కొండంత ఆవేదనను జోడిస్తూ అఖండ భారత దేశం రెండు ముక్కలైంది. హిందూ ముస్లిం అల్లర్లలో లక్షలాది అమాయకులు మాన ప్రాణాలు , ఆస్తులు , ఇళ్లూవాకిళ్లూ తమకలవాటైన పరిసరాలూ కోల్పోయారు.
        చరిత్ర లోకి తొంగి చూస్తే భారత స్వాతంత్ర్య సంగ్రామం  1857 సంవత్సరం లోమీరట్ లో జరిగిన  సిపాయి తిరుగుబాటుతో మొదలయినట్టు కనిపిస్తుంది. అప్పటిదాకా తిరుగుబాటు ఎరుగని బానిసల్లా, తమ చైతన్యాన్ని , స్వేచ్చాప్రియత్వాన్ని మరచిపోయి బతికిన భారతీయుల్లో ఒక్కసారిగా మార్పు తెచ్చిన సంఘటన సిపాయి తిరుగు బాటు అనవచ్చు. బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలన  పట్ల దేశ ప్రజల్లో ఏర్పడ్డ నిరసన భావం 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్దాపనకు దారితీసింది. 1907 లో కాంగ్రెస్ పార్టీలో బాల గంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్‌ చంద్ర పాల్ఈ లాల్‌బాల్‌పాల్ త్రయం విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చారు. స్వదేశీ ఉద్యమాన్నిలేవనెత్తారు.
       భారత స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటి ప్రజా ఉద్యమం 1905 లో ప్రజ్వరిల్లిన వందేమాతరం ఉద్యమం. 1906 లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన  దాదాభాయ్ నౌరోజీ స్వరాజ్యం కోసం పిలుపునిచ్చారు. అహింసా మార్గంలో సహాయ నిరాకరణోద్యమం ద్వారా అప్పటికే సౌతాఫ్రికా లో భారతీయుల సమాన హక్కుల కోసం పోరాడి గెలిచిన న్యాయవాది గాంధీజీ మాతృదేశం పట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం 1914 లో స్వదేశానికి తిరిగి వచ్చారు.
          జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. అమృత్‌సర్ పట్టణంలో జలియన్ వాలాబాగ్  తోట లో రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమావేశమైన నిరాయుధ స్త్రీ, పురుషులు , పిల్లలపైన, బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పది నిమిషాలపాటు కొనసాగిన ఈ కాల్పుల్లో అధికారిక ప్రకటన వేరుగా ఉన్నా వాస్తవానికి  వెయ్యిమందికి  పైగా మరణించారనీ ,  రెండువేల మందికి పైగా గాయపడ్డారనీ అంచనా.
ఈ సంఘటనకు నిరసనగా విశ్వకవి రవీంద్రనాథ ఠాకూర్, బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును తిరిగి ఇచ్చివేశారు. ఈ సంఘటన 1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా  సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. ఆ తర్వాత జరిగిన ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చి లో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం , బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 లో తలపెట్టిన "క్విట్ ఇండియా" ఉద్యమాలలో గాంధీజీ నిర్దేశించిన మార్గంలో  భారత జాతి అంతా నడిచింది. అప్పటివరకు స్వతంత్ర భారతదేశం కోసం  ప్రతిభా వంతమైన  ప్రణాళిక లేక అస్తవ్యస్తంగా నడిచిన భారతప్రజలని గాంధీజీ ఒక్క తాటిపై నడిపించారు. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం; ఆవేశం స్థానంలో అహింసను ఆయుధాలుగా గాంధీజీ మలచిన తీరు ప్రపంచదేశాలను విస్మయానికి గురి చేసింది.
     లాలా లజపతి రాయ్ , సరోజినీ దేవి, సర్దార్ వల్లభభాయి పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ , బాబూ రాజేంద్రప్రసాద్, గోపాలకృష్ణ గోఖలే, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్వేపల్లి రాధాకృష్ణన్,చక్రవర్తి రాజగోపాలాచారి  వంటి గాంధేయవాదులూ, రాజ్ గురు , సుఖ్ దేవ్, ఖుదీరామ్ బోస్, మదన్ లాల్ ధింగ్రా, చంద్రశేఖర ఆజాద్ , సుభాష్ చంద్ర బోస్  వంటి విప్లవ యోధులూ, అకుంఠిత దీక్షతో లక్ష్యసాధనే ధ్యేయంగా స్వాతంత్ర్యసంగ్రామంలో అనితర సాధ్యమైన పాత్రలను పోషించారు. లాఠీ దెబ్బలకూ , కఠినమైన జైలు జీవితానికీ  వెరవకుండా తమ ఆస్తిపాస్తులనూ, కుటుంబ జీవన సౌఖ్యాన్నీ త్యజించి, మాతృభూమి దాస్యవిమోచన కోసం  ఆత్మార్పణ  చేశారు.
    రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత దేశాన్ని ఇంకా పట్టి ఉంచగలిగే శక్తి తమకు లేదని ఆంగ్లేయులు గ్రహించారు. భారతం లో పోటెత్తుతున్న స్వాతంత్ర్యపోరాటపు ఉధృతి , ఇక ఈ దేశంపై పరాయి పాలన సాగదని వారికి తెలియజెప్పింది. 1947 ఆగస్టు 15 వ తేదీన భారతదేశానికి స్వరాజ్యం సిధ్ధించింది. అఖండ భారతం రెండు దేశాలుగా విడిపోయింది . ఢిల్లీ రాజధానిగా భారత్ , కరాచీ రాజధానిగా పాకిస్తాన్ ఏర్పడ్డాయి. మహ్మదాలీ జిన్నా, ముస్లిం రాజ్యమైన పాకిస్తాన్ కి గవర్నర్ జనరల్ గా కరాచీలోనూ , స్వతంత్ర భారత దేశానికి మొదటి ప్రధానమంత్రిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీలోనూ ప్రమాణ స్వీకారం చేశారు.
     మిన్నంటే ఉత్సవ సంబరాల నడుమ జాతిపిత మహాత్మా గాంధీ కోసం ప్రజలంతా ఎలుగెత్తి పిలిచారు, ప్రార్థనలు చేశారు.కానీ మహాత్ముడు ఈ ఉత్సవానికి దూరంగా కలకత్తాలో ఉండి, దేశ విభజన , తదనంతరం చెలరేగిన మతకలహాల  వల్ల దు:ఖితుడై , 24 గంటల ఉపవాస దీక్షలో మునిగి, హిందూ ముస్లిం సఖ్యతను, శాంతినీ కోరుతూ ప్రసంగించారు. లార్డ్  మౌంట్ బాటన్  గవర్నర్ జనరల్ గా మరొక పది నెలల పాటు స్వతంత్ర పరిపాలనకు తోడ్పాటునందించారు. ఆ తర్వాత గవర్నర్ జనరల్ గా పదవీ బాధ్యత చేపట్టిన చక్రవర్తి రాజగోపాలాచారి , ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూల సారథ్యంలో స్వతంత్ర భారతదేశం మనుగడ సాగించింది.
    మన జాతీయపండుగలు మూడింటిలో స్వాతంత్ర్యదినోత్సవం ఒకటి  (మిగిలిన రెండూ రిపబ్లిక్ డే, మహాత్మా గాంథీ పుట్టిన రోజు) . భావి తరాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం తమ ప్రాణాలర్పించిన  త్యాగ ధనులకి మన మంతా నివాళులర్పించే రోజిది. ఈ సందర్బంగా  పాఠ శాలల్లోనూ, కళా శాలల్లోనూ ఆకాశవాణి, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల్లోనూ అనేక రకాల పోటీలూ, ప్రత్యేక కార్యక్రమాలూ చోటుచేసుకుంటాయి . బహుమతి ప్రదానోత్సవాలు జరుగుతాయి. ప్రధాన మంత్రి, దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట పైన జాతీయ పతాకాన్ని ఎగరేసి, దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర రాజధానీ నగరాల్లో కూడా పతాకావిష్కరణ , సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రంగు రంగుల దీప తోరణాలు కార్యాలయాల మీద , గృహ సముదాయాల మీదా తళుకులీనుతుంటే, కూడళ్ళ లోనూ, ఇంటి పైకప్పుల మీదా, ప్రభుత్వకార్యాలయాల మీదా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే, ప్రజలంతా దేశ స్వాతంత్ర్యం సిద్ధించిన రోజుని గొప్ప ఉత్సవంగా జరుపుకుంటారు . విదేశాల్లో కొన్ని ప్రాంతాలలో  ఆగస్టు పదిహేనవ తేదీని ఇండియా డే గా వ్యవహరిస్తారు.
       జాతీయపతాకం ఎగరేయడంలో పాటించాల్సిన  పద్దతులు, సంప్రదాయాలు కేంద్రప్రభుత్వం రూపొందించిన ఫ్లాగ్ కోడ్-ఇండియా లో కనిపిస్తాయి. ఈ కోడ్ ప్రకారం  మన జాతీయపతాకం లో ఆకుపచ్చ, తెలుపు, నారింజరంగుల్లో కనిపించే అడ్డ పట్టీలు ఒకే వెడల్పులో ఉండాలి. మధ్యలో ఉన్న తెలుపురంగు పట్టీపైని నావిక నీలి ధర్మచక్రంలో 24 గీతలుండాలి. అన్ని గీతల మధ్య దూరం సమానంగా ఉండాలి. దీనికి వాడే వస్త్రం చేనేత వస్త్రమై ఉండాలి. జాతీయపతాకంలో కాషాయరంగు అగ్రభాగాన ఉండాలి. పతాకాన్నిఏవిధమయిన ప్రకటనలకు ఉపయోగించరాదు. జాతీయపతాకం వాడుకలో ఫ్లాగ్ కోడ్-ఇండియా లోని  నియమాలన్నీ పాటించాలి .
       దేశ విభజన సమయంలో మొదలైన దారుణ మారణహోమం తర్వాత మన దేశంలో అనేకసార్లు మత పరమైన కల్లోలాలు చెలరేగాయి.1961లో జబల్పూర్ లో,1979 లో జమ్ షె డ్ పూ ర్ , ఆలీ గర్ లలో , 1980 లో మొరాదాబాద్ లో హిందూ ముస్లిమ్ ల మధ్య రేగిన కలహాలలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు.1984 లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో ప్రజ్వరిల్లిన సిక్కుల ఊచకోత పదిహేను రోజులపాటు కొనసాగింది. 1992 లో తీవ్ర రూపం దాల్చిన అయోధ్య లోని బాబ్రీ మస్జిద్ – రామ జన్మ భూమి వివాదం ఎంత మందిని పొట్టన పెట్టుకుందో లెక్కలేదు. అలాగే 2002 లో గుజరాత్ లో ని గోద్రాలో మొదలైన విధ్వంసం  వేలమంది మృతికి కారణమై ఇరు వర్గాల లోనూ మరచిపోలేని తీవ్రమైన గాయాలను మిగిల్చింది. 2008 లో ఒడిశా లో మత మార్పిడుల నేపధ్యంలో తలెత్తిన హిందూ క్రిస్టియన్ మతకలహాలలో ఇరవై మంది చనిపోగా పన్నెండు వేల మంది నిర్వాసితులయారు.
       2012 జూలై లో అస్సామ్ లో  బోడోలకూ, ముస్లింలకూ మధ్య మొదలైన  కలహాలు  అతి త్వరలో దాదాపు వంద మంది మరణానికీ ,నాలుగు లక్షల మంది నిరాశ్రయులవడానికీ దారితీసింది. ఒక ప్రజాస్వామిక దేశమైన భారత దేశం లో ఒక ప్రాంతానికి చెందిన వారిపై హింసకు పాల్పడడం, వారు ఇతర ప్రాంతాలలో వృత్తి ఉద్యోగాలు సాగించకుండా అడ్డుకోవడం, వారిని భయభ్రాంతులను చేసి , స్వస్ధలాలకు తరిమి వేయడం ఇటీవలి కాలంలో మొదలైన విచారకరమైన పరిణామం. చట్టవ్యతిరేకంగా అస్సామ్ లోకి చొరబడిన బంగ్లాదేశీయుల వల్ల ఈశాన్యప్రాంతాల రక్షణ వ్యవస్థ, ఉద్యోగావకాశాలే కాక దేశ భద్రత కూడా ముప్పు ఏర్పడుతోందన్నది జగమెరిగిన సత్యం.
       ఈ మతకలహాలన్నిటి వెనకా అంతర్జాతీయ మతోన్మాద శక్తుల ప్రమేయం ఉందని తెలిసినా, తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాద కార్యకలాపాలను చూసీ చూడనట్టు వదిలేసే అగ్ర రాజ్యాలు, తమ రాజకీయ తంత్రాల కోసం ప్రపంచ శాంతిని పణంగా పెడుతున్నాయి. దశాబ్దాలుగా శాంతి కాముక దేశమైన భారత్ , పొరుగు దేశపు పన్నాగాలలో,  వారు నిరంతరాయంగా సృష్టిస్తున్న ఉగ్రవాదపు జ్వాలల్లో చిక్కుకుని హింసకు గురవుతుంటే చోద్యం చూస్తున్న అగ్రరాజ్యం  , ఆ మంట మిన్నంటి తమనంటుకునే సరికి  ఉగ్రవాదమన్నది అప్పుడే మొదలైనట్టూ , తమ దేశం ఒక్కటే ఆ దుష్ఫలితాలకు గురైనట్టూ గంగవెర్రులెత్తడం ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞులందరినీ విస్తుపోయేలా చేసింది.
           లంచగొండితనం , మతోన్మాదాలకు తోడుగా ఉగ్రవాదం మన దేశ ప్రగతినెంతగా అతలాకుతలం చేస్తోందో తెలుసుకోవాలంటే మనకు స్వాతంత్ర్యం వచ్చాక గడచిన అరవై ఆరు సంవత్సరాలలో కేరళ , తమిళనాడు , కోయంబత్తూరు, ఆంధ్ర ,కర్ణాటక , మిజోరం, మణిపూర్, త్రిపుర , అస్సాం, నాగాలాండ్, వారణాసి, అయోధ్య, ఢిల్లీ, పంజాబ్ , బీహార్, జమ్మూ, కాశ్మీర్, పూనా, ముంబై ..ఇలా దేశంలోని అనేక రాష్ట్రలలో, ప్రధాన పట్టణాలలో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులను పరిశీలించాలి. ఈ దాడుల వల్ల జరిగిన తక్షణ ధన , ప్రాణ నష్టం  ఒకెత్తయితే , నిందితులను పట్టుకోవడానికీ , కోర్టులలో వారి విచారణకూ , జైళ్లలో వారి పోషణ కూ అయ్యే  ధననష్టం  మరొక ఎత్తు.  ప్రాణాలకు తెగించి పట్టుకున్న నేరస్థులను బేషరతుగా విడిపించుకుందుకు ఉగ్రవాద సంస్థలు విమానాల హైజాకింగ్  వంటి దారులనెంచుకోవడం వల్లా, ఉక్కు పాదంతో వారి ఆగడాలను అణచలేని ప్రభుత్వాల మెతకదనం  వల్లా ఎదురయ్యే బహుముఖమైన నష్టం ఇంకొక ఎత్తు.
        2008 సంవత్సరం నవంబరు 26 వ తేదీన ముంబై లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ లోనూ, తాజ్ మహల్ పాలెస్ హోటల్ , ఓబరాయ్ ట్రైడెంట్ ల పైనా జరిగిన దాడికి కారకులైన వారిలో పట్టుబడిన ఒకే ఒక్క ఉగ్రవాది అజ్మల్ కసబ్ ని, సుదీర్ఘ విచారణానంతరం 2012 నవంబరు 21 న ఉరితీసే వరకు మన ప్రభుత్వం అతని మీద పెట్టిన ఖర్చు(ప్రభుత్వ లెక్కల ప్రకారం)  29.5 కోట్లు ! బాధితుల కుటుంబాలకి ఇచ్చిన నష్ట పరిహారం , ఆ ఘటన కు సంబంధించిన ఇతర ఖర్చులు  లెక్కిస్తే మొత్తం ఖర్చు వంద కోట్లు దాటిందని ఒక అంచనా.
       స్వతంత్ర భారతి పుట్టిన నాటి నుండి నేటి వరకు  మన దేశం మరే ఇతర దేశం పైనైనా దండెత్తిన, దాడి చేసిన సంఘటన ఒక్కటి కూడా లేదు. మన దేశం కళల కాణాచి. అతిథులెవరైనా సరే ఆదరించడమే మనకు తెలుసు. స్నేహానికి చిరునామా ఉంటే అది మన దేశమే. 1600 లకు పైగా గుర్తించబడ్డ భాషలున్న, అనేక మతాలూ, సంస్కృతులు మిళితమైన  మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక .
       “నేను భారత దేశం నలు చెరగులా తిరిగాను గాని ఒక్క బిచ్చగాడిని గాని, ఒక్క దొంగని గాని చూడలేకపోయాను. అంతటి సంపద, అంతటి నైతిక విలువలు, సామర్థ్యమూ ఉన్న ప్రజలని చూశాక ఇలాంటి దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఈ దేశపు వెన్నెముకని విరిస్తే గాని సాధ్యపడదని నాకర్ధమైంది. ఈ దేశపు బలమంతా వీరి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం లో ఉంది. వీరి ప్రాచీన విద్యా విధానాన్ని, సంస్కృతినీ తొలగించి , ఆంగ్ల భాషా, సంస్కృతులే గొప్పవని వారనుకునేలా చేయగలిగితే , భారతీయులు వారి ఆత్మ గౌరవాన్నీ , తమదైన సంస్కృతినీ కోల్పోయి మనకు వశమవుతారు   
     1835 వ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగిస్తూ మన దేశం గురించి అన్న మాటలివి !
    “ పలు మతాల భాషల పరిమళాల కదంబం ,
      పలు రీతుల సంగమం మా భారత కుటుంబం !
     సకళకళారామమిదే మా నివాసము ,
     అందరినీ ఆదరించు స్వర్గధామము
     ఇలాతలము పై వెలసిన స్నేహ దీపము , 
     సమత మమత రూపమే మా దేశము ! ”
     అంటూ సగర్వంగా ప్రకటించే పాట విన్నపుడు నేటి అల్లకల్లోల పరిస్ధితులు గుర్తొచ్చి ఆ వర్ణన అతిశయోక్తిగా అనిపించినా  చరిత్రలో మన దేశం గురించి విదేశీ పర్యాటకుల అభిప్రాయాలు చదివితే, మన నిజ స్వరూపం ఇదేనని , శతాబ్దాల పరాయి పాలనలో మనం మన మూలాలని కోల్పోయామనీ అర్ధమౌతుంది.
     రాజకీయ రంగం లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేళ్లూనుకుపోయిన లంచగొండితనం, సామాన్య పౌరుల్లో నిండిపోయిన అలసత్వం, ఆరోగ్యకరమైన సమాజంలో సగభాగమై నిలవాల్సిన స్త్రీ పట్ల గౌరవం లేకపోవడం, సమిష్టి సంపదల పట్ల , సదుపాయాల పట్ల మనం కనపరచే బాధ్యతారాహిత్యం  గమనిస్తే  ముందు తరాల భవిష్యత్తు కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం తమ ప్రాణాలనే అర్పించిన మహాపురుషుల త్యాగానికి మనం అర్హులమేనా అనే ప్రశ్న అంకుశమై పొడుస్తుంది.
      ఎంత అరకొర దుస్తులు ధరించిన స్త్రీనైనా ముందు మనిషిగా చూసే దేశాల పక్కనే నిండుగా దుస్తులు ధరించినా, నిండా నాలుగేళ్లు లేని పాపాయి నైనా హృదయస్పందన లేని భోగవస్తువుగా పరిగణించే మనవారి అనాగరికత తల దించుకునేలా చేస్తుంది. గనుల కుంభకోణాలూ, నదులపై అనుమతులే లేని ప్రాజెక్టులూ, వాటి వల్ల ఏర్పడుతున్న విధ్వంసాలూ గమనిస్తే సహజవనరుల పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల  మన నిర్లక్ష్యం  గగుర్పాటు కలిగిస్తుంది !
       ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు పదవినడ్డం పెట్టుకుని స్వాహా చేసిన వేల కోట్ల ప్రజా ధనం , ప్రభుత్వోద్యోగుల అన్యాయార్జితమైన నల్లధనం స్విస్ బ్యాంకులలో మూలుగుతున్నా, అక్రమాస్తుల రూపంలో కళ్లెదుట కనిపిస్తున్నా, మన ప్రభుత్వం పార్టీ ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్టుండిపోవడం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రభుత్వాలెన్ని మారినా  ఉగ్రవాదాన్ని అణచడం పట్ల మన వైఖరి ఒకలాగే ఉంది. మన శాంతి కాముకత పొరుగు వారి దృష్టికి అసమర్థతగా, చేయెత్తి  పిలుస్తున్న అవకాశంగా పరిణమిస్తోంది !
       “పదవీ వ్యామోహాలూ, కుల మత భేదాలు , భాషా ద్వేషాలూ చెలరేగే నేడు
         ప్రతి మనిషీ మరియొకరిని దోచుకునే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునే వాడే !
        ఆకాశం అందుకునే ధరలొక వైపు అదుపులేని నిరుద్యోగ మింకొకవైపు
        అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు ? “ 
       అయిదు దశాబ్దాల క్రితమే మహాకవి శ్రీ శ్రీ  రచించిన ఈ గీతం నేటి పరిస్థితులకీ అద్దం పడుతోందంటే , కళ్లముందు స్పష్టంగా కనిపిస్తున్న సమస్యలనెదుర్కొని పరిష్కరించుకోవడంలో మనమెంత విఫలమౌతున్నామో స్పష్టమౌతోంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నెదిరించి అహింసా మార్గంలో వారిని తరిమి కొట్టగలిగిన మన పూర్వుల మానసిక, నైతిక, ధార్మిక శక్తి కి మనం వారసులం కాలేక పోతున్నామన్న చేదు నిజం స్పష్టమౌతుంది.
      అయితే ఇటీవల సీబీఐ వెలికి తీసిన కుంభకోణాలు, వాటి పూర్వా పరాలూ చూస్తే ఎంత పెద్ద పదవి లో ఉన్న వారి పైనైనా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం, ఒత్తిళ్లకు లొంగకుండా అరదండాలేయడం గమనిస్తే కారుచీకట్లలో సుదూరంగానైనా ఒక కాంతిపుంజం కనిపించి మన దేశ ఉజ్వల భవిత పట్ల కొద్దిపాటి నమ్మకం కలుగుతుంది. దేశ రాజధానిలో జరిగిన నిర్భయ అత్యాచారం పట్ల ప్రజానీకపు ప్రతిస్పందన గమనిస్తే సామాన్యుల్లో ఇప్పటి వరకు కనిపించిన అలసత్వం , నీరస స్వభావం క్రమక్రమంగా తొలగిపోయి దేశ యువతలో వివేకానందుడు ఉద్బోధించిన కార్యశూరత్వం, దేశ వ్యాప్తంగా గాంధీజీ కలలుగన్న ప్రజాస్వామ్యం సాధ్యమౌతాయన్న ఆశ కలుగుతుంది.
     మూడు దశాబ్దాలలో సామాజికంగానూ, పర్యాటక రంగంలోనూ, పర్యావరణ పరిరక్షణలోనూ, రక్షణ వ్యనస్ధ పరంగానూ, విలువల్ని పరిరక్షించుకోవడం లోనూ అద్బుతమైన ప్రగతి సాధించిన అతి చిన్న దేశం సింగపూర్. నిబధ్ధత , దార్శనికత ఉంటే ఆ దేశ పురోగతికి ఆకాశమే హద్దని నిరూపించింది. చెప్పుకోదగ్గ సహజ వనరులేవీ లేకపోయినా ప్రపంచంలోనే అతి తక్కువ నేరాలు నమోదయ్యే ఈ దేశం ఎన్నదగ్గ ఆర్ధక సుస్థిరతనీ, పురోగతినీ సాధించి , ప్రపంచదేశాల నడుమ సగర్వంగా నిలబడింది. పరిపాలనలో ఏ విధమైన శిక్షణా లేని వ్యక్తులు ప్రజా ప్రతినిధులై ; విద్యాధికులై , శ్రమకోర్చి, శిక్షణ పొందిన ప్రతిభగల అధికారులపై హుకుం చలాయించే వ్యవస్థలో మార్పు రావాలంటే మన లక్ష్యం సరైన వ్యక్తులనెన్నుకోవడం వైపుండాలి. వ్యక్తులలో మార్పు, వ్యవస్ధలో మార్పుకి దారితీస్తుందనేది జగమెరిగిన సత్యం. మనలో సమిష్ఠిగా వచ్చే మార్పే మన దేశ భవితను మార్చగలదు.
       స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబర పడగానే సరికాదోయీ,
       సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయీ !
       ఆగకోయి భారతీయుడా! కదలి సాగవోయి ప్రగతి దారులా!

అంటూ శ్రీ శ్రీ పలికిన విజయగీతికను ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మననం చేసుకుంటూ, ప్రగతి దారుల్లో కదలి సాగేందుకు అందరమూ సన్నద్ధులమౌదాం!                                           ****