December 5, 2015

మన మహా నగరపు పుస్తకాల పండుగ

         
        ప్రతి ఏడూ డిసెంబర్ నెలలో వచ్చే పుస్తకాల పండగ, Hyderabad Book Fair, ప్రారంభమై దాదాపు మూడు దశాబ్దాలు కావస్తోంది. 1985 లో 25 స్టాళ్లతో చిక్కడపల్లిలో మొదలైన ఈ బుక్ ఫెయిర్ రానురాను  విశాలమై గత రెండేళ్ళుగా సువిశాలమైన ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించబడుతోంది. 
           సాంకేతికత సాయంతో సాహిత్యం కూడా డిజిటలైజ్ అవుతున్న రోజుల్లో అచ్చులో పుస్తకాలెవరైనా కొంటున్నారా అని సందేహ పడే వాళ్ళకి, క్రితం సంవత్సరం 317 స్టాళ్ల తో లక్షల పుస్తకాలకు పది రోజుల పాటు నిలయమైన పుస్తకాల జాతర విభ్రాంతిని కలిగించింది. బుక్‌ఫెయిర్‌ చరిత్రలో ఇప్పటివరకు, ఒకే సారి 60 వేల మంది పుస్తక ప్రియులు  పుస్తక ప్రదర్శన ని సందర్శించింది లేదు. కిందటేడు పుస్తకాల పండగ మొదలైన మూడోరోజు, ఇళ్ళలో టీవీ సీరియళ్ళు మారుమోగిపోయే వేళ, కంప్యూటర్ తెరలు వెలుగులు చిందే వేళ , పుస్తకాలని వెతుక్కుంటూ అరవై వేల మంది ఎన్టీఆర్ స్టేడియంకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది, పుస్తకానికీ మస్తకానికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోలేదని  తెలియజెప్పింది.
            పుస్తక మేళాలో ఈసారి  చోటు చేసుకున్న కొత్తదనాల్లో ఒకటి జేవీ పబ్లిషర్స్ తో కలిసి ప్రమదాక్షరి సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్. ఎంతో శ్రమకోర్చి తాము వెలువరించిన పుస్తకాలని వాటికోసం ఎదురుచూస్తున్న పాఠకులకి అందజేసే పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమన్నది ఎన్నో ఏళ్ళుగా రచయితలు ఎదుర్కొంటున్న సమస్య.
వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలూ , పోటీ పరీక్షల పుస్తకాలూ, కిందటి తరంలో ప్రముఖులైన రచయితల నవలలూ, కథా సంపుటులూ బాగా అమ్ముడుపోతున్న నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ తమకున్న పరిమిత స్థలంలో ఆయా పుస్తకాలని మాత్రమే ప్రదర్శనకు పెట్టడం జరుగుతోంది. 
           సాధారణంగా సాహిత్యాభిమానులైన  పాఠకులు తమకెదురుగా కనబడుతున్న పుస్తకాలని అటూ ఇటూ తిరగేసి కాస్త బావున్నట్టనిపించిన పుస్తకాలని ఎన్నుకుని కొనుక్కుంటారు. కిందటి తరంతో పోలిస్తే ఈ తరానికి ఖాళీ సమయం తక్కువ. ఎదురుగా కనబడని పుస్తకం కోసం అడిగి, షాపులో కుర్రాడు వెతికి తెచ్చేదాకా  వేచిచూసే పాఠకులు  చాలా తక్కువ.  సమీక్షలు చదివో, అక్కడక్కడ చదివిన కథల వల్ల ఒక రచయితమీద అభిమానం కలిగో,  ‘ఫలానా పుస్తకం ఉందా’ అని ప్రత్యేకించి పాఠకులు  అడిగే సందర్భాలు ఆ రచయితకి అపురూపమైనవి.
          దురదృష్ట వశాత్తూ అలాంటి సందర్భాల్లో చాలా సార్లు, పేరున్న పుస్తకవిక్రేతలు (ఆ రచయిత పుస్తకాలు తమ గోడౌన్ లో ఉన్నాకూడా )  పాఠకులడిగిన పుస్తకం లేదని చెప్పేస్తూ ఉంటారు. దీనిక్కారణం ఆ రచయిత పట్ల కక్షో , కార్పణ్యమో కాదు.  రోజుకి డజన్ల లెక్కలో అమ్ముడుపోయే పుస్తకాలుండగా, చెదురుమదురుగా అమ్మకమయ్యే పుస్తకాలని ప్రదర్శించడానికి స్థలం వెచ్చించలేక. మరి రచయితల దగ్గర పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ నిమిత్తం ఎందుకు తీసుకుంటారో అర్ధం కాని విషయం.
         ఈ విషయంలో నాకెదురైన అనుభవం ఎందరో రచయితలకి కూడా ఎదురయ్యే ఉండాలి. నా కథలు ప్రచురితమైన ప్రతిసారీ కొందరైనా పాఠకులు ‘ మీ పుస్తకాలేవైనా పబ్లిష్ అయాయా? అయితే ఎక్కడ దొరుకుతా’యని అడగడం, నా పుస్తకాలు దొరికే షాపుల వివరాలు చెప్పడం జరిగేది. అయితే చాలా కాలం తర్వాత నాకు తెలిసిందేమంటే అలా నా పుస్తకాలకోసం  ఎవరైనా పాఠకులు తమకు దగ్గర్లో ఉన్న ఆయా బుక్ హౌస్ ల బ్రాంచిలకి వెళ్ళినా, వాళ్ళకి అడిగిన పుస్తకాలు దొరికేవి కావని. ఎప్పుడో చాలా కాలం తర్వాత అలాంటి పాఠకులు నాకు మళ్ళీ ఎదురైన (అరుదైన) సంఘటనల వల్ల నాకీ విషయం తెలిసింది. అప్పటినించి ప్రతిసారీ హైదరాబాద్  బుక్ ఫెయిర్  జరుగుతున్నపుడు నేను తప్పకుండా నా పుస్తకాలు తీసుకున్న బుక్ హౌస్ ల స్టాల్స్ దగ్గరకి వెళ్ళి ‘వారణాసి నాగలక్ష్మి గారి ఆలంబన/ఆసరా/ వానచినుకులు పుస్తకం ఉందా’ అని అడగడం, వాళ్ళు లేవని చెప్పడం పరిపాటి అయిపోయింది!
       పత్రికల్లో తమ పుస్తకానికి అద్భుతమైన సమీక్ష వచ్చినపుడు ప్రతి రచయితా ఎంతో ఎదురుచూస్తాడు ఆ పుస్తకపు సేల్స్ రిపోర్ట్ కోసం. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సమీక్షలు చదివరు. రాబోయే పాఠకుల్ని ఊహించుకుని ఆ పుస్తకాలని సిద్ధంగా పెట్టుకోరు. ఆసక్తికరంగా అనిపించిన పుస్తకం కోసం ట్రాఫిక్ భూతాల్ని ఎదుర్కొంటూ వెళ్ళిన కొద్దిమంది పాఠకులకి కోరిన పుస్తకాలు రెడీగా దొరకవు. తెప్పిస్తామని దుకాణదారులు చెప్పినా మళ్ళీ వాహనసముద్రాల్ని ఈదుకుంటూ వెళ్ళి, ఇంతోటి పుస్తకాన్నీ తెచ్చుకునే ఓపిక ఆ పాఠకుడికి ఉండదు.
       ఇలాంటి పాఠకులు  సంవత్సరంలో ఒకసారి వచ్చే పుస్తకాల పండగ కోసం ఎదురుచూస్తారు, ఒక్కచోటే అన్ని పుస్తకాలూ దొరుకుతాయి కదా అని. అయితే ఈ బుక్ ఫెయిర్ లలో కూడా వారి ఆశ తీరదు. ఎందుకంటే పెద్ద పెద్ద షాపుల్లోనే ప్రదర్శించడానికి వీలుకాని పుస్తకాలకి బుక్ ఫెయిర్లో స్థలం దొరుకుతుందా?
ఇలాంటి నేపధ్యం లో ఫేస్ బుక్  సామాజిక మాధ్యమాన్ని సాహితీ చర్చల కోసం వాడుకుంటూ సన్నిహితమవుతున్న కొందరు             రచయిత్రులు, పాఠకురాళ్ళూ  ‘ప్రమదాక్షరి’అనే ఫేస్ బుక్ సమూహంగా ఏర్పడడం జరిగింది.
కొత్త పత్రికల గురించి, కొత్త శీర్షికల గురించి, పోటీలను గురించి, తెలుసుకుంటూ, రచనల్ని మెరుగుపరుచుకుంటూ, సాంకేతిక విషయాల్లో కలిగే సందేహాల్ని నివృత్తి చేసుకుంటూ, మంచి మంచి చర్చలకు, నూతన కార్యక్రమాలకు, రకరకాసాహితీ ప్రక్రియలకు శ్రీకారం చుడుతూ, రాగద్వేషాలకు అతీతంగా కలసికట్టుగా నడవాలనే  ఆశయంతో  మంథా భానుమతి, సమ్మెట ఉమాదేవిలు అడ్మిన్స్ గా  పదిమంది కన్న తక్కువ  సభ్యులతో ఆగస్టు నెలలో  మొదలైన ఈ సమూహం  ఇంతింతై వటుడింతై అన్నట్టు నవంబర్ నాటికి తొంభై మంది సభ్యులతో నిరంతర చైతన్యానికి నిలయమయింది. ఈ ఆరు నెలల్లో నెలకో, రెండు నెల్లకో ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకుంటూ, భావాలు కలబోసుకుంటూ, సరదా కబుర్లూ, ఆట పాటలతో  సాగుతున్న ప్రమదాక్షరి  మీటింగ్స్ తో సభ్యులందరిలో కొత్త చేతన మొలకెత్తింది.
         అలా కలుసుకున్న ఒక సందర్భంలో, నేను పుస్తకాల అమ్మకం విషయంలో రచయితలు ఎదుర్కొంటున్న సమస్యని జ్యోతి వలబోజుతో చర్చిస్తూ ‘ఈ సారి బుక్ ఫెయిర్ లో మనమే ఒక స్టాల్ ఎందుకు పెట్టుకోకూడదు’ అనడం, వెంటనే ఆమె ‘ఈ సంవత్సరం బుక్ ఫెయిర్ లో మనం ఒక స్టాల్ ఏర్పాటు చేసుకుంటున్నాం’ అనడం జరిగాయి. అన్నట్టే ఇరవై తొమ్మిదవ, హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రచయిత్రుల స్టాల్ ఒకటి ఏర్పాటై చర్చనీయాంశమై చరిత్ర సృష్టించిందంటే అతిశయోక్తి కాదు. 
        జ్యోతి వలబోజు చేతల మనిషి. మాటతో పాటే సంకల్పాన్ని జతచేసే కార్య శీలి. మూడేళ్ల క్రితం ‘మాలిక’ జాల పత్రికని స్థాపించిన ఆమె, తన పత్రికలో ప్రచురణ కోసం  ‘తండ్రి- తనయ’ అనే ఇతివృత్తం మీద ప్రమదాక్షరి రచయిత్రులందరినీ కథలు రాయమని కోరింది. అతి తక్కువ వ్యవధిలో మాలో కొందరు  రాసి పంపిన  కథలన్నీ ఆగస్ట్ నెల ‘మాలిక’ లో చోటు చేసుకున్నాయి. వాటికి ఆ తర్వాత అందిన మరికొన్ని కథలని చేర్చి, 2014 సంవత్సరం మొదట్లో తను స్థాపించిన జేవీ పబ్లిషర్స్ సంస్థద్వారా, ఇరవై నాలుగు కథలతో  ఒక కథా సంపుటి  ‘ప్రమదాక్షరి కథా మాలిక - తండ్రి తనయ’ పేర (ప్రచురణ ఖర్చులు రచయిత్రులంతా కలిసి పంచుకునే పద్ధతిలో) పుస్తకంగా తెచ్చింది. దీనికి  తన వంటల పుస్తకాలు రెండు  (తెలంగాణా వంటలు వెజ్, నాన్ వెజ్), నా కొత్త పుస్తకం ‘ఊర్వశి’ నృత్య నాటిక జత చేస్తే, మొత్తం 2014 సంవత్సరం లో జేవీ పబ్లిషర్స్ బానర్ కింద వెలువరించిన పుస్తకాల సంఖ్య ఇరవై అవుతుంది. ఊర్వశి విషయానికి వస్తే ఈ 32 పేజీల చిన్న నాటికని సరిగ్గా పది రోజుల్లో డీటీపీ చేయించి బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవం నాటికి పుస్తకంగా తీసుకురావడం జ్యోతి సమర్ధతకి నిదర్శనమే.

     


         
     ప్రమదాక్షరి, జేవీ పబ్లిషర్స్ సంయుక్తంగా సహకార ప్రాతిపదికపైన తలపెట్టిన పుస్తక శాలలో రచయిత్రులూ, ప్రమదాక్షరి సభ్యులేకాక కొందరు రచయితలు కూడా తమ పుస్తకాలను చేర్చి ఈ ఆలోచన తాలూకు స్కోప్ ని పెంచారు.  పుస్తక ప్రదర్శన మొదలైన వారం రోజుల్లోనే  మేము ఏర్పాటు చేసుకున్న స్టాల్ లో అమ్మకాలు లక్ష దాటాయి. రచయితల పుస్తకాలని  మధ్యవర్తులు లేకుండా నేరుగా పాఠకులకి చేర్చడమనే ఈ ఆలోచన కార్య రూపం దాల్చడంలో ప్రమదాక్షరి సభ్యులంతా పాలుపంచుకున్నా ప్రధాన పాత్ర పోషించింది మాత్రం మంథా భానుమతి, జ్యోతి వలబోజు, కన్నెగంటి అనసూయ. 

   బుక్ ఫెయిర్ పూర్తి అయ్యాక కన్నెగంటి అనసూయ  ఇంట్లో ( తను స్వయంగా వండి వడ్డించిన ) విందులో, బుక్ ఫెయిర్లో పాల్గొన్న రచయిత్రులంతా కలుసుకుని ఎవరికి రావలసిన సొమ్ము వాళ్ళు అందుకున్నారు. సోమరాజు సుశీల గారు తనకు రావలసిన సొమ్ము తీసుకుంటూ ఇన్నేళ్ళుగా రాస్తున్నా నా పుస్తకాల కి ఒక్కసారిగా ఇంత డబ్బు ఎప్పుడూ అందుకోలేదని అన్నపుడు అందరి మనసుల్లోనూ అదే భావం కదిలింది. అంతర్జాలంలో కావలసినంత సాహిత్యం లభిస్తుండగా
ఎదురుగా ఎప్పుడూ కనబడని పుస్తకాల కోసం ఎవరైనా ఎంతని వెతుక్కుంటారు?
            కేవలం ముప్ఫై మంది మాత్రమే పాలు పంచుకున్న ఈ స్టాల్ , మిగిలిన స్టాల్స్ తో పోలిస్తే తక్కువ పుస్తకాలతో ఖాళీ ఖాళీగా అనిపించినా , సృజన కారుల్ని స్వయంగా కలుసుకుని , ముఖా ముఖీ మాట్లాడే అవకాశంకోసం చాలామంది పాఠకులు ప్రమదాక్షరి స్టాల్ కి వచ్చి పుస్తకాలు కొనుక్కున్నారు.    


         మళ్ళీ ఏడాదికి ఇదే పని మరింత విస్తృతంగా చేయాలని , తెలుగు కథకులంతా ఇదే బాట పట్టి తమ పుస్తకాలని తామే ప్రదర్శించుకునే ప్రయత్నం చెయ్యాలనీ చాలామంది రచయితలు సంకల్పించారు. ఈ పుస్తకాల పండగ ప్రమదాక్షరికి నిజమైన పండగలా జరిగిందంటే అతిశయోక్తి కాదు. చూస్తూండగానే ఏడాది గిర్రున తిరిగి వచ్చింది, కొత్త పుస్తకాల కబుర్లు మోసుకొస్తూ.

     మన దేశంలో ఎన్నో పండగలు.. ప్రతీ కూడలి లోనూ రంగురంగుల విద్యుద్దీపాలతో వెలిగిపోతూ , డిస్కౌంట్ల వలలు విసురుతూ ఎన్నో బట్టల షాపులు.. ఈ పండగకి మాత్రం  'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో- ఒక మంచి పుస్తకం కొనుక్కో' అన్న కవి వాక్కు గుర్తు చేస్తే పాఠకులేమంటారో!    








4 comments:

  1. అభినందనలు నాగలక్ష్మీ. చాలా చక్కగా విశ్లేషించి ప్రమదాక్షరి సభ్యుల ఆదర్శాన్ని, మనో భావాలని వెలిబుచ్చావు. నిజంగానే మనందరం కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎంతో సంతృప్తినిచ్చింది. మళ్ళీ ఎప్పడెప్పుడా అని ఎదురు చూసేట్లు చేసింది.

    ReplyDelete
  2. Chakkagaa vivarimchaaramdi Nagalakshmigaru.. AbhinaMdanalu..

    ReplyDelete
  3. స్పందించిన మిత్రులకి ధన్యవాదాలు!

    ReplyDelete